![]()
మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ జ్వరం
- ఇంటి నుంచే కార్యక్రమాల పర్యవేక్షణ..!
అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో మంత్రి జ్వరం బారిన పడ్డారు. దీంతో మంత్రిత్వశాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు. అయితే గత ఐదు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు పలు వైద్య పరీక్షలు చేయగా, డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది.
ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో మంత్రి చికిత్స తీసుకుంటున్నారు. జ్వరంలో ఉండి కూడా మంత్రి రోజువారి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతర పనుల పురోగతిని, ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకుంటూ, అవసరమైన సూచనలు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో కోలుకొని, పునరుత్తేజంతో మేడారం సమ్మక్క సారలక్క జాతరలో మంత్రి కొండా సురేఖ పాల్గొననున్నారు.


