![]()
- మారుమూల గ్రామాల్లో పోలీస్ కమ్యూనిటీ కనేక్ట్ ప్రోగ్రాం
- ప్రజలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
- మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు – ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
చర్ల, మన భద్రాద్రి న్యూస్
ఏజెన్సీ మారుమూల గ్రామాల్లోని ప్రజలు, యువత మావోయిస్టులకు సహకరించవద్దని, వారికి సహకరించి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని,మారుమూల ఆదివాసి గ్రామాల్లో అభివృద్ధికి చాలా దూరంగా బ్రతుకుతున్న ఆదివాసీలను అభివృద్ధి మార్గం వైపు పయనించేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని భద్రాచలం ఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాలైన బట్టి గూడెం, రామచంద్రపురం లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనేక్ట్ ప్రోగ్రాం లో అయన పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిని ఆయన సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సమస్యలు, అవసరాల కోసం, భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం,అభివృద్ధి కొరకే పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలియజేశారు. మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ప్రజా సేవలు ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్న స్థానిక పోలీసు అధికారులకు తెలియజేస్తే వాటిని పరిష్కరించటం జరుగుతుందని అన్నారు.
మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవు
గ్రామంలో ఎవరైనా మావోయిస్టులకు సహకరిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని, గ్రామాల్లోని ప్రజలు యువత మావోయిస్టు కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, మావోయిస్టులకు సహకరించవద్దని, మావోయిస్టులకు సహకరించి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజలు చైతన్యంతో ఉంటూ వారిని గ్రామాలకు రానివ్వకుండా పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. పరోక్షంగా నైనా ప్రత్యక్షంగానైనా నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరించిన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లోని యువత బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో చేరి ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని, తమ గ్రామానికి,జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం అక్కడ పాల్గొన్న ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్, చర్ల సీఐ ఏ.రాజు వర్మ, ఎస్సై ఆర్.నర్సిరెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


