![]()
- అడవుల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి బోర్ల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించాలి
- ప్రతి 15 రోజులకు గ్రామపంచాయతీల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు శుభ్రపరచాలి
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్తో అన్ని ఆవాసాలను అనుసంధానం చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. మిగిలిపోయిన అన్ని ఆవాసాలకు రక్షిత మంచి నీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. అడవుల్లో నివసించే ప్రజలకు సైతం కుళాయి నీళ్లు అందించాలని ఆదేశించారు. అడవుల్లో విద్యుత్ లైన్లు వేసేందుకు కేంద్ర అటవీ శాఖ అనుమతులు ఇవ్వడం లేదని, అడవుల్లో ఉన్న ఆవాసాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి బోర్ల ద్వారా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. నీటి సోర్స్ పాయింట్లు దగ్గర్లో ఉండేలా చూసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి 15 రోజులకు శుభ్ర పరచాలని సూచించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న తాగునీటినీ వినియోగించే విధంగా ప్రజలకు నమ్మకం కలిగించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. కాగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై బడ్జెట్ సన్నాహక సమావేశం శనివారం నిర్వహించారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నివేదించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 51 వేల కోట్ల బడ్జెట్ను పీఆర్ అండ్ ఆర్డీ ప్రతిపాదించింది. గత బడ్జెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.23 వేల కోట్లు కేటాయింపులు జరిగాయని తెలిపారు. చేయూత కింద పింఛన్ల మొత్తాన్ని పెంచాలని పీఆర్ అండ్ ఆర్డీ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. చేయూత పథకం కోసం 22 వేల కోట్లు అవసరం అవుతాయని అంచన వేశారు. ప్రస్తుతం ఆసరా పెన్షన్ల కోసం రూ. 12 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. గ్రామీణ రహదారుల బడ్జెట్ను రెట్టింపు చేయాలని ప్రతిపాదించారు. మహిళా స్వయం సంఘాల లోన్ బీమా, ప్రమాద బీమా కోసం అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.


