![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఇరాన్ అణు స్థావరాల ధ్వంసమే అమెరికా టార్గెట్ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దాడులను అధికారికంగా ప్రకటించారు. ఇరాన్పై దాడులు అమెరికా మిలటరీ విజయమని ప్రశంసలు కురిపించారు.
ఇదే సమయంలో శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్దే అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇరాన్పై అమెరికా దాడుల తర్వాత అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ట్రంప్ వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ..’ఇరాన్పై మేము దాడులు చేశాం. కీలకమైన ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే మా లక్ష్యం. అమెరికా, ఇజ్రాయెల్, ప్రపంచానికి ఇది చారిత్రక క్షణం. ఇది మా మిలటరీ విజయం. మేం చేసిన దాడులు చాలా కష్టతరం. ప్రపంచంలో ఏ దేశానికి ఇది సాధ్యం కాదు. మేము ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తాం. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్దే. ఇరాన్ శాంతి మార్గం వెళ్లకపోతే భవిష్యత్లో మరిన్ని ఎక్కువ దాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు.


