![]()
-జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
గుండాల, మన భద్రాద్రి న్యూస్
నీతి అయోగ్ ఆస్పిరేషనల్ జిల్లా మరియు ఆస్పిరేషన్ మండలం ఆకాంక్షిత బ్లాగ్ కార్యక్రమంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ హాజరైనారు. గుండాల గ్రామ కూడలి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు నిర్వహించిన అవగాహనా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు మరియు అధికారులతో ఆయన మన జిల్లాను ఆకాంక్షిత జిల్లా నుండి స్ఫూర్తిదాయక జిల్లాగా మార్చడానికి నా వంతు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఐదు రకాల మొక్కలను నాటారు. జిల్లాలో నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ లక్ష్యాలను సమన్వయంతో సాధిద్దామని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలలో అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తామని, అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు పిల్లల యొక్క బరువును ఖచ్చితంగా నమోదు చేయాలని, SAM/MAM పిల్లలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. ఆశా మరియు ఏఎన్ఎంలు గర్భిణీ స్త్రీలను గుర్తించి వారిని మొదటి త్రైమాసికంలోపు ఆరోగ్య కేంద్రంలో నమోదు చేపించాలని, పిల్లలకు అన్ని రకాల టీకాలు సరైన సమయంలో వేయించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అధికారులకు సూచించారు. సంఘ మహిళలు కుట్టు మిషనుకు మోటారు అమర్చి స్కూల్ యూనిఫాంలు కుట్టడం వలన తక్కువ శ్రమతో ఎక్కువ పనిచేయవచ్చు అని సూచించారు. పిల్లలకు పుస్తకంలోని పాఠాలను, మన నిత్య జీవితంలో జరుగుతున్న అంశాలతో పోలుస్తూ బోధన చేయడం ద్వారా మరింత అవగాహన కలిగి వారు సులభతరంగా పాఠాలు నేర్చుకునేందుకు ఉపయోగపడుతుందని కలెక్టర్ సూచించారు. సంపూర్ణత అభియాన్ లో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి లో ప్రభుత్వ పాఠశాలలో పోషకాహారం తీసుకోవడం వల్ల విద్యార్థులపై ప్రభావం అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో భాగంగా గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ఆయన అందించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఆరుగురు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ న్యూట్రిషన్, విద్య, వ్యవసాయం మొదలైన శాఖల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కలెక్టర్ పరిశీలించి, తగు సూచనలు చేశారు. అనంతరం జగ్గు తండాలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న సౌకర్యాలు మరియు పోషక ఆహార పంపిణీ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో నీటి నిల్వకు ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం కాచనపల్లి క్రీడా పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. క్రీడా మైదానం మరియు కావలసిన మౌళిక సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, సీపీఓ శ్రీనివాసరావు, మహిళ శిశు సంక్షేమ అధికారి విజేత, జిల్లా వైద్యశాఖాధికారి భాస్కర్ నాయక్, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర చారి, ఆస్పిరేషనల్ బ్లాగ్ ఫెల్లో నవనీత్, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, వైద్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పాఠశాల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


