![]()
ఏపీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పైన పోరుబాటకు మాజీ సీఎం జగన్ సిద్దం అయ్యారు.
కొత్తగా డిజిటల్ బుక్ ను ప్రారంభించారు. ప్రభుత్వ వైఫల్యాల పైన క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలని పార్టీ నేతలకు జగన్ పిలుపు ఇచ్చారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ షర్మిల రంగంలోకి దిగుతున్నారు. పార్టీ నేతలతో కలిసి సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించారు. ఈ సమావేశం ఆసక్తి కరంగా మారుతోంది. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించారు. రైతు సమస్యల పైన సీఎంను కలవనున్నట్లు వెల్లడించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పైన తాజాగా షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ‘రైతన్నకు అండగా కాంగ్రెస్’ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అన్నదాతల ఆక్రందన లపై కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి కాంగ్రెస్ నేతలతో చర్చించాక .. సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళతామని తెలిపారు. అయితే.. ముఖ్యమంత్రి ని కలిసే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రైతుల సమస్యల పైన సోషల్ మీడియా వేదికగా షర్మిల ప్రభుత్వం పైన విమర్శలు చేసారు.
రాష్ట్రంలో యూరియా కొరత పైన షర్మిల స్పందించారు. యూరియా సకాలంలో ఇవ్వడం చేతకాక రోగాల పేరుతో రైతులను నిందించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో యూరియా కొరత తీరేదెన్నడు…రైతుల పంట పండేదెన్నడు ? యూరియా అందించలేని కూటమి ప్రభుత్వం ఉంటే ఎంత ? ఊడితే ఎంత ? యూరియా కొరతపై కూటమి ప్రభుత్వం చెప్తున్నవన్నీ కుంటి సాకులు. యూరియా ఎక్కువగా వాడుతున్నారని, క్యాన్సర్ కి కారణం అవుతున్నారని, రాష్ట్రంలో టాప్ 5 లో క్యాన్సర్ రోగం ఉందని, ఏడాదికి ఒకే సారి వరి సాగు చేయాలని, యూరియా వాడుకుంటే 800 రూపాయలు ఇస్తామని, అసెంబ్లీ వేదికగా రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం నిజంగా హాస్యాస్పదం. రైతు సంక్షేమమే అజెండా అని చెప్పుకొనే కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో చేతులెత్తేసిందని షర్మిల విమర్శించారు. కాగా, సీఎం చంద్రబాబును కలవనున్నట్లు షర్మిల చెప్పటం.. వినతి పత్రం ఇవ్వనుండటంతో… సీఎం నుంచి వచ్చే స్పందన పైన ఆసక్తి నెలకొంది.


