![]()
సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఆర్టీసీ ఉద్యోగులు
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో
సీఎం రేవంత్ ఇంటికి ఆర్టీసీ ఉద్యోగులు భారీగా చేరుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో చిన్న చిన్న కారణాలతో తమను ఉద్యోగాల నుంచి తొలగించారని కొత్త ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ బుధవారం ఉదయం సీఎం నివాసానికి తరలి వచ్చారు. చిన్న చిన్న కారణాలతో 1000 మందిని గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల నుంచి తొలగించారని టైర్లు పంక్చర్ అయినా, అనారోగ్యం కారణాలతో సెలవు పెట్టినా తమను డ్యూటీలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎంను కలిసేందుకు వచ్చిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలకు చెందిన ఉద్యోగులకు అన్యాయం జరిగిందని, తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎండీ సజ్జనార్ కార్యాలయానికి కాదు కదా కనీసం ఆర్ఎం కార్యాలయం వద్దకు కూడా రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి ఆదుకుని తమ ఉద్యోగులు తిరిగి ఇప్పించాలని కోరారు.


