![]()
-పీడీఎస్యూ ఇల్లందు డివిజన్ కార్యదర్శి
గుండాల, మన భద్రాద్రి న్యూస్
తెలంగాణ విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని పీడీఎస్యూ ఇల్లందు డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో విద్యార్థులకు స్కాలర్షిప్ లు చెల్లించకుండా కాలయాపన చేసి, మొండి చేయి చూపించారని ఆరోపించారు. ఫలితంగా విద్యార్థులు ఫీజులు చెల్లించలేక నేటికీ తమ సర్టిఫికెట్స్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల వద్దనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని, ఇప్పటివరకు తెలంగాణ విద్యార్థులకు సుమారు 7 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని, వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా, దృష్టి సారించకపోవడంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురి కావాల్సి వస్తుందని వాపోయారు. రాష్ట్రంలో ఫీజులు చెల్లించలేని విద్యార్థులు పై చదువులకు వెళ్లలేకపోతున్నారని, విద్యా సంస్థలు నడిపించలేక కొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యా సంస్థలను మూసివేశారని, మరికొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు కొత్త గురుకులాలకు అద్దె భవనాలుగా ప్రభుత్వానికి అప్పజెప్పిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ఏది ఏమైనా ప్రభుత్వం స్కాలర్షిప్ లపై ఒక స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి, ప్రవేటు విద్యా సంస్థల యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని, తక్షణమే స్కాలర్షిప్స్ మరియు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ మండల నాయకులు వినయ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.


