![]()
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు (Hyderabad Traffic) గూగుల్ తో కలిసి పని చేయబోతున్నామని సిటీ సీపీ సీవీ ఆనంద్ (Hyd CP CV Anand) తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్( ఐటీఎంఎస్) రూ.100 కోట్ల వ్యవస్థను ఎల్అండ్ టీ ఇదివరకే ఏర్పాటు చేసిందని దీనిలో ఉన్న అన్ని ఫీచర్లు ఇప్పటి వరకు ఉపయోగించుకోలేకపోయామన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలతో గూగుల్ తో ఎంవోయూ చేసుకుని వారి గూగుల్ మ్యాప్ డేటా అనలిటిక్స్ సిస్టమ్స్ ఉపయోగించుకుని ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను మరింత మెరుగుపరిస్తామన్నారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు సైంటిఫిక్ పద్ధతులను అవలంభిస్తున్నామని డ్రోన్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ ఎక్కువ ఉన్న చోట్ల డ్రోన్లు వాడుతామని చెప్పారు. ఇప్పటికే ట్రాఫిక్ మేనేజ్ మెంట్ కోసం హైరైజ్ కెమెరాలు (Highrise cameras) తీసుకువచ్చామని చెప్పారు. ఎక్కువ ఎత్తు కలిగిన బిల్డిగ్స్ యజమానులను ఒప్పించి అక్కడ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రస్తుతం 25 ప్రాంతాల్లో ఇటువంటి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. దీని ట్రాఫిక్ కు సంబంధించి బర్డ్ ఐ వ్యూ విజువల్స్ లభిస్తున్నాయన్నారు. ఇది కొత్త ఆలోచన అని రాబోయే రోజుల్లో ఈ హైరైజ్ కెమెరాలను పెంచబోతున్నట్లు చెప్పారు.సముదాయాల యజమానులదే బాధ్యత:హైదరాబాద్ నగరంలో వాహనాల సంఖ్య 91 లక్షలకు చేరిందని ఫోర్ వీలర్ల సంఖ్య కూడా బాగా పెరిగిందని సీవీ ఆనంద్ చెప్పారు. అన్ని జంక్షన్లలో ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయడానికి సిబ్బంది కొరత ఉందన్నారు. అందువల్ల హైదరాబాద్ సిటీ సెక్యురిటీ కౌన్సిల్ ట్రాఫిక్ ఫోరం ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ట్రాఫిక్ మార్షల్ స్కీమ్ ను పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నామని చెప్పారు. నగంలోని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా ఉన్న భారీ వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రుల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ఆయా భవనాల సముదాయాలు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వీళ్లంతా ఐదారుగురు ఉద్యోగులను నియమించుకుని తమకు అప్పగిస్తే వారికి ట్రైనింగ్ ఇచ్చి సంబంధిత భవనాల వద్ద వారే ట్రాఫిక్ నియంత్రణ చేసేలా ఏర్పాటు చేస్తామన్నారు.85 శాతం ఆటోమోడ్ సిగ్నల్స్:నగరంలో వీఐపీ మూవ్ మెంట్ కోసం ఉపయోగించే మాన్యువల్ మోడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ను 15 శాతానికి తగ్గించామని సీవీ ఆనంద్ చెప్పారు. ప్రస్తుతం సిగ్నల్స్ 85 శాతం ఆటోమోడ్ లో నడుస్తున్నాయని దీని వల్ల యావరేజ్ స్పీడ్ పెరుగుతుందన్నారు. దీన్ని 90 శాతానికి పెంచేలా కృషి చేస్తున్నామన్నారు. ఎన్ని కేసులు నమోదు చేశామనేది కాకుండా వాహనదారులల్లో మార్పు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నిర్ణయంతో కేసుల నమోదు సంఖ్య తగ్గిందన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఆపరేషన్ రోప్ ను మరింత సమర్థవంగా చేపట్టేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. రాత్రి వేళలో నగరంలో ట్రావెల్స్ బస్సుల నాన్సెన్స్ పెరిగిపోతున్నదని వారితో చర్చించి పరిష్కారం చూపిస్తామన్నారు.


