![]()
భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-సెల్ఫీల కోసం వాగులు, చెరువుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురికావద్దు
-అవసరమైతే తప్పా బయటకి రావద్దు.. సీఐ రాజు వర్మ
చర్ల, మన భద్రాద్రి న్యూస్, జూలై 21
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫీల కోసం వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సీఐ ఏ రాజు వర్మ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని వివిధ గ్రామాల్లోని చెరువులు, వాగులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయని, చెరువులు, వాగుల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగటానికి, చేపలు పట్టటానికి ఎవరు వెళ్లకూడదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సరదా కోసం పిల్లలు, యువకులు ఫోటోల కోసం, ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఎవరు పాడుబడిన ఇళ్లల్లో, చెట్ల కింద ఉండకూడదని సూచించారు. ముఖ్యంగా వర్షం కురుస్తున్న సమయాల్లో రైతులు తమ పొలాల్లోని కరెంటు మోటార్ల వద్దకు వెళ్ళవద్దని, రానున్న రెండు మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో డయల్ 100 కు ఫోన్ చేసి తక్షణమే పోలీసు వారి సహాయం పొందాలని తెలియజేశారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రజలు స్థానిక పోలీసులకు సహకరించి సమాచారం అందించాలన్నారు.


