![]()
*అధ్వానంగా నాగినేనిప్రోలు రెడ్డిపాలెం – లక్ష్మీపురం రహదారి*
– గోతుల రోడ్డుపై ప్రయాణం అంటే నరకయాతనే..
– అధికారులు ఎప్పుడు మేల్కొంటారు?
– వరదల సమయంలో గ్రామాల రాకపోకలకు ఇదొక్కటే మార్గం..
– వెంటనే మరమ్మతులు చేయాలని గ్రామస్తుల విజ్ఞప్తి
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్, జులై 06
బూర్గంపహాడ్ మండలం, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం – లక్ష్మీపురం గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారి భారీ గోతులతో పూర్తిగా దెబ్బతిని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ రహదారిపై ప్రయాణించాలంటే నరకయాతన అనుభవించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రహదారిపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడటంతో ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు సైతం సురక్షితంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గతంలో స్కూల్ బస్సు గోతిలో చిక్కుకుని ఒకవైపు ఒరిగిపోయిన ఘటన కూడా చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
గోదావరి వరదల సమయంలో ఈ రహదారే నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ ప్రజలకు ప్రధాన రాకపోకల మార్గం. గ్రామస్తులు ఉద్యోగాలకు వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు చేరుకోవాలన్నా, ఐటీసీ కార్మికులు కర్మాగారానికి వెళ్లాలన్నా ఇదే ఏకైక దారి.
ఇప్పటికే రహదారి ఇంత దారుణంగా ఉండగా, త్వరలో గోదావరి వరదలు వస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోతులు నీటితో నిండిపోవడంతో వాహనాలు ఇరుక్కుపోయే ప్రమాదం ఉండటమే కాకుండా, ప్రాణాపాయ ఘటనలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు.
గ్రామస్తులు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ రహదారిపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
*ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు…*
– ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ రహదారిని అధికారులు ఇంకా ఎందుకు పట్టించుకోవడం లేదు?
– ప్రమాదాలు జరిగిన తర్వాతే స్పందిస్తారా..?
– వరదల సమయంలో అత్యవసర పరిస్థితులు తలెత్తితే బాధ్యత ఎవరు తీసుకుంటారు?
– విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామస్తుల ఇబ్బందులు అధికారులకు కనిపించడం లేదా?
*తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్*
ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ఆర్ అండ్ బీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి నాగినేనిప్రోలు రెడ్డిపాలెం – లక్ష్మీపురం రహదారికి అత్యవసర మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.








