![]()
తేదీ: 13-06-2026 , మణుగూరు మండలం మన భద్రాద్రి న్యూస్
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. మణుగూరు మండలంలోని సుందరయ్య నగర్, మేదర్ బస్తి, కుంకుడు చెట్ల గుంపు ప్రాంతాల్లో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు మరియు సైడ్ డ్రెయిన్ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి, మురుగునీటి పారుదల సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. గ్రామాలు, కాలనీలు, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారుతాయని, వర్షాకాలంలో నీటి నిల్వలు, బురద సమస్యలు తగ్గి ప్రజలు ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు మరియు ఉద్యోగులకు ఈ అభివృద్ధి పనులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని అన్నారు. పినపాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలు సూచించిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన మరియు సంక్షేమ పథకాల అమలులో ముందంజలో ఉందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్ మరియు ఇతర అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నామని, నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో AE, DE, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ సైదులు, మైనారిటీ అధ్యక్షుడు రహీం పాషా, INTUC రాష్ట్ర నాయకుడు సామా శ్రీనివాసరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, తుపూడి శ్రీను, అబ్దుల్లా, నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కురం రవి, దేవదాస్, మేస్త్రి రవి, సుబ్రమణ్యం, మంగ, దేవి, కార్యకర్తలు, కాలనీవాసులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








