![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 18
వచ్చే వర్షాకాల సీజనుకు రైతులకు ఎరువులు విత్తనాలను సకాలంలో అందించాలని, రైతు రుణాలను మాఫీ చేసి, నూతన రుణాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని, అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని శనివారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు నాయని రాజు, మండల కార్యదర్శి డి వీర బ్రహ్మచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు చేసిన వాగ్దానాల అమలులో ఇంకా మీనమేషాలు లెక్కపెడుతోందని, ఆరు గ్యారంటీల ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. చేయని పక్షంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతోందని హెచ్చరించారు. రైతాంగ సమస్యలపై మే 23 న మండల కేంద్రంలో రైతులతో ర్యాలీ నిర్వహించి, డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు సమర్పించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జరుపల సుందర్, పంతులు, లింగ తదితరులు పాల్గొన్నారు.


