![]()
మన భద్రాద్రి స్పోర్ట్స్ డెస్క్, మార్చి 16
ఇండియా మాస్టర్స్ జట్టు సత్తా చాటింది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టైటిల్ను సొంతం చేసుకుంది. వెస్టిండీస్ మాస్టర్స్ టీమ్తో రాయ్పుర్ వేదికగా జరిగిన తుదిపోరులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 4 వికెట్లు కోల్పోయి.. 17.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అంబటి రాయుడు(74; 50 బంతుల్లో 9×4,3×6) అర్ధ శతకంతో చెలరేగాడు. సచిన్ తెందూల్కర్ (25; 18 బంతుల్లో 2×4, 1×6), గుర్ కీరత్ సింగ్ (14) ఫర్వాలేదని పించారు. చివర్లో వచ్చిన యువరాజ్ (13*), స్టువర్ట్ బిన్నీ (16*) నాటౌట్గా నిలిచారు. విండీస్ బౌలర్లలో అష్లే నర్స్ 2 వికెట్లు పడగొట్టగా.. టినో బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ స్మిత్ (45; 35 బంతుల్లో 6×4, 2×6) అద్భుత ప్రారంభాన్నిచ్చాడు. అయితే, కెప్టెన్ బ్రియాన్ లారా (6), ఫస్ట్ డౌన్లో వచ్చిన పెర్కిన్స్ (6) నిరాశ పరిచారు. నదీమ్ బౌలింగ్లో పెర్కిన్స్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే వినయ్కుమార్ బౌలింగ్లో నేగికి క్యాచ్ ఇచ్చి లారా పెవిలియన్కు చేరాడు. రెండో డౌన్లో వచ్చిన సిమన్స్ (57; 41 బంతుల్లో 5×4, 1×6)తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. క్రీజులో నిలదొక్కుకుంటున్న ఈ జోడీని నదీమ్ విడగొట్టాడు. జట్టు స్కోరు 67 పరుగుల వద్ద స్మిత్ బౌల్డయ్యాడు. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా.. సిమన్స్ అర్ధశతకం సాధించి.. జట్టుకు మంచి స్కోరే అందించాడు. భారత్ మాస్టర్స్ బౌలర్లలో వినయ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా..నదీమ్ 2, నేగి, బిన్నీ చెరో వికెట్ తీశారు.


