![]()
- జ్యూడిషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు
న్యూఢిల్లీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్, జులై 03
మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 25 వరకు కోర్టు పొడిగించింది. బుధవారం తో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియగా, జైలు అధికారులు కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణను రౌజ్ అవెన్యూ కోర్టు జూలై 25కి వాయిదా వేసింది. 24 రోజుల తరువాత కవితను అధికారులు మళ్లీ కోర్టుకు ముందుకు హాజరు పరచనున్నారు. అయితే ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న కోర్టు కవితకు జూలై 25 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న కవిత బయటకు వచ్చేలా కనిపించడం లేదు. కవితకు ముందు ముందు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈ ఏడాది మార్చి 15న కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కవితను కోర్టులో హాజరుపరచగా, కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అప్పటి నుంచి ఈ కేసులో బెయిల్ కోసం కవిత ప్రయత్నించి విఫలమైంది. మరోవైపు కవితపై ఈడీ కేసులతో పాటు సీబీఐ కూడా అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసింది. దీంతో కవిత ఈడీ కేసు, సీబీఐ కేసులను ఎదుర్కోనున్నారు. బెయిల్ కోసం కోర్టు దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ ఈడీ, సీబీఐలు గట్టి వాదనలు వినిపించి కవితకు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. కోర్టులో వాదనలు వినిపించిన ప్రతిసారీ ఈడీ, సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో కవిత పాత్రపై కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. అంతేకాదు కవిత నేరం చేసినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని కోర్టులో గట్టిగా వాదిస్తున్నారు. ఈ కేసు నుంచి ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించడం లేదు. బెయిల్ కూడా రాకుండా తీహార్ జైలులో కవిత మగ్గుతున్నారు. వరుస షాక్ లతో ఖంగు తింటున్నారు.


