![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: తెలంగాణ రైతుల అప్పులు జాతీయ సగటు కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారుయ ఆయన లోక్సభలో మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
ఒక్కో రైతు కుటుంబంపై జాతీయ సగటు అప్పు రూ.74,121 ఉండగా.. తెలంగాణలో అది రూ.1.52 లక్షలుగా ఉందని ఆయన తెలిపారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ వివరాలను అందించారు.
- ఎరువుల సరఫరాపై కేంద్రాన్ని తప్పుపట్టిన మంత్రి తుమ్మల
ఎరువుల సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ను తప్పుదారి పట్టిస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రానికి 20.20 లక్షల టన్నుల యూరియా లభ్యత ఉన్నట్లు కేంద్రం చెబుతోందని, కానీ కేవలం 9.80 లక్షల టన్నుల యూరియా మాత్రమే కేటాయించారని ఆయన అన్నారు. దీనివల్ల రైతులు గందరగోళానికి గురవుతున్నారని ఆయన తెలిపారు.
- కేంద్రానికి తుమ్మల లేఖ..
ఆగస్ట్ 2న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్కు లేఖ రాశారు. ఈ లేఖలో, కేటాయింపులు, సరఫరా మధ్య ఉన్న వ్యత్యాసాన్ని.. రాష్ట్రంలో యూరియా కొరతను ఆయన వివరించారు. వానాకాలం సీజన్కు కేంద్రం 9.80 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. దీనిని ప్రతినెలా సరఫరా చేయాలి. కానీ కేటాయించిన దాని కంటే తక్కువగా సరఫరా చేయడంతో యూరియా కొరత ఏర్పడిందని నాగేశ్వరరావు తన లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జులై వరకు తెలంగాణకు 6.60 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా.. కేవలం 4.36 లక్షల టన్నులు మాత్రమే పంపిణీ చేశారని ఆయన తెలిపారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. యూరియా కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారని కూడా వెల్లడించారు. జూలై వరకు ఉన్న 2.24 లక్షల టన్నుల లోటును వెంటనే పూరించి, ఆగస్ట్ నెల కేటాయింపులను కూడా సరఫరా చేయాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు.


