![]()
తెలంగాణ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సచివాలయం వేదికగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కలెక్టర్లు, అధికారులు కూడా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని కీలక ప్రకటన చేశారు. ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పారు. మంత్రులు బాధ్యత తీసుకొని స్థానిక ఎమ్మెల్యేలను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అన్నారు. ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుండటంతో రేషన్ కార్డుల డిమాండ్ బాగా పెరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కొత్తగా 7 లక్షల కార్డులు ఇచ్చామని అన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఎరువులు దొరకడం లేదని ప్రచారం చేస్తున్నారు. షాపులో ఎంత స్టాక్ ఉందో బయట నోటీస్ బోర్డులో పెట్టాలి. ఎరువుల షాపులపై పోలీసులు, అధికారుల నిఘా ఉండాలి. రాయితీపై ఇచ్చే ఎరువులను ఇతర వ్యాపారాలకు వాడుతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎరువుల దారి మళ్లింపును అడ్డుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాల పరిధిలోని ఐఏఎస్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి. కలెక్టర్ల కార్యచరణ రిపోర్టు నాకు రోజూ పంపించాలి. రోజూ కలెక్టర్లు ఏ పనిచేశారో నాకు తెలియాలి. ఆదివాసీ ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు కలెక్టర్లు పర్యవేక్షించాలి. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్లు ఖర్చు పెట్టడానికి ఒక్కొక్కరికి రూ.కోటి కేటాస్తున్నాం. వీటితో పాటు వాటర్ మేనేజ్మెంట్పై కూడా కలెక్టర్లు ఫోకస్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.


