![]()
-గ్రామపంచాయతీలను పట్టించుకోని ప్రత్యేకాధికారులు
-వారానికోకసారి కూడా గ్రామాలకు రాని వైనం
-నిధుల కొరతతో గ్రామపంచాయతీలు విలవిల
-కార్యదర్శులపైనే మొత్తం పని భారం
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్
ప్రభుత్వం ఒక్కో అధికారికి మూడు,
నాలుగు గ్రామపంచాయతీల బాధ్యతలను అప్పగించడంతో వారు చుట్టపు చూపుగా గ్రామాలకు రావడంతో గ్రామపంచాయతీల పాలన అస్తవ్యస్థంగా మారిపోయింది. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలు, చేతిపంపులు మరమ్మతులకు నోచుకోకపోవడం, పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ కొరవడడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు ఈ ఏడాది జనవరి నెలాఖరునాటికి సర్పంచుల పదవీ కాలం ముగిసింది. దీంతో గ్రామపంచాయతీల పాలనా వ్యవహారాలను చూసేందుకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రత్యేకాధికారుల పాలన మొదలై ఆరు నెలలవుతోంది. నిధుల లేమికి తోడు తమకున్న శాఖారపరమైన విధులే కాకుండా, గ్రామాల ప్రత్యేక అధికారుల అదనపు బాధ్యతలు అప్పగించడంతో సదరు అధికారులు పల్లెలను పెద్దగా పట్టించుకోవడం లేదు. నామమాత్రంగానైనా పల్లెల ముఖం చూడడం లేదు. దీంతో గ్రామపంచాయతీల్లో పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా స్థానికంగా గ్రామపంచాయతీ కార్యదర్శులపైనే మొత్తం పని భారం పడుతుంది. అభివృద్ధి పనులు పడకే శాయి. మరమ్మతులు అటకెక్కాయి. ప్రత్యేకాధికారుల పాలనకు ముందు గ్రామపంచాయతీ ఖాతాల్లోని నిధులను సర్పంచులు వాడేసుకున్నారు. ఇప్పుడు గ్రామపంచాయతీల ఖాతాల్లో ఒక్క పైసా కూడా లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొన్ని నెలలుగా నిధులు జమకావడం లేదు. దీంతో గ్రామపంచాయతీల పాలన మొక్కుబడిగా సాగుతోంది. పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. గతంలో చేపట్టిన పలు పనులకే నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉండడటంతో, కొత్త పనులు చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుత వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే ప్రజలు జబ్బుల బారినపడే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగీ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. పారిశుద్ధ్య చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిధులకు కటకట
గ్రామపంచాయతీలు నిధుల కటకటను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ఖాతాల్లో డబ్బులు లేక, అత్యవసర పనులకు ఖర్చు చేయలేక సతమతమవుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, పైపుల లీకేజీ మరమ్మతు, బోర్ల మరమ్మతు పనులు, గ్రామపంచాయతీ ట్రాక్టర్ నెలవారీ బ్యాంకు వాయిదా, గ్రామాల్లో విద్యుత్ దీపాలు, నెలనెలా విద్యుత్ బకాయిలు ఇవన్నీ కచ్చితంగా చెల్లించాల్సిందే. నిధులు లేకపోవడంతో ఈ బరువు బాధ్యతల గురించి ప్రత్యేకాధికారులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గామ కార్యదర్శులే ఎలాగోలా కార్మికులకు జీతాలు సర్దుబాటు చేస్తున్నారు. గ్రామపంచాయతీల ప్రత్యేకాధికారులు ఖర్చు విషయంలో లెత్తేస్తుండడంతో భారమంతా కార్యదర్శులపైనే పడుతోంది. నాలుగు రోజులు ఉండిపోయే వాళ్లమని ప్రత్యేకాధిరులు దాటవేత ధోరణిని అనుసరిస్తున్నారు.


