![]()
- టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జులై 03
గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని, పండిట్, పిఈటి పోస్టులను అప్గ్రేడ్ చేయాలని, టిడబ్ల్యూపిఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని, జీవో 317 బాధిత ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలలో రెగ్యులర్ పోస్టులు మంజూరు చేయాలని, సూపర్ న్యూమరరీ పోస్టులలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులర్ పోస్టులు మంజూరు అయ్యేవరకు కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలో సర్దుబాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మూడు దశల పోరాట కార్యక్రమాలలో భాగంగా ఈనెల 6న కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం హైదరాబాద్ ముందు జరిగే మూడో దశ నిరసన ప్రదర్శన కార్యక్రమంలో ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ కోరారు. ఈ సందర్భంగా కోయగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత 13 సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో పనిచేస్తూ,ఆరు సంవత్సరాలుగా పదోన్నతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ని వెంటనే విడుదల చేసి నిర్వహించాలని, ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి ప్రమోషన్లు ఇచ్చిన మాదిరిగానే, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో కూడా ఈ పోస్టులను అప్గ్రేడ్ చేసి వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, 11 సంవత్సరాల క్రితం హాస్టళ్లను కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలుగా కన్వర్ట్ చేసి నేటి వరకు రెగ్యులర్ పోస్టులు మంజూరు చేయకపోవడంతో ఆ పాఠశాలు కేవలం సిఆర్టిలతోనే నిర్వహించబడుతున్నాయని, వెంటనే కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలలో రెగ్యులర్ పోస్టులు మంజూరు చేయాలని, జీవో 317 అలోకేషన్ లో అనేకమంది ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయి, భార్యాభర్తలు చెరొక జిల్లాలో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, వారికి స్థానికత ఆధారంగా అలోకేట్ చేయాలని, జీవో 317 బాధిత స్పౌజ్ ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేసేటట్టు బదిలీలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. పై ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 6న గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం హైదరాబాద్ ముందు నిర్వహించబోయే నిరసన ప్రదర్శనకు పెద్ద ఎత్తున ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు తరలి రావాలని, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ని విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ మండల కార్యదర్శి బి.శ్రీనివాస్, జిల్లా కౌన్సిలర్ ఈ.ముత్తయ్య, సీనియర్ కార్యకర్తలు టి.శ్రీనివాసరావు, సిహెచ్.జానకి, సిహెచ్.వీరన్న, బి.బాలరాజు, బి.వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


