![]()
-క్షేమంగా బయట పడ్డ కుటుంబం
గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 15
కొత్తగూడెంలోని రామవరంకు చెందిన కుటుంబ సభ్యులు కాళేశ్వరంలో తమ కుటుంబానికి చెందిన వారి ఆస్థికలు నదిలో కలపడానికి శనివారం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొత్తగూడెం వెళ్ళడానికి పస్రా మీదుగా గుండాల దారిలో వస్తున్న క్రమంలో రహదారిలో ఎక్కువ మూలమలుపులు ఉండడం, దానికి తోడు రహదారిలో హెచ్చరిక సూచికలు పెట్టకపోవడంతో వారు ప్రయాణించే కారు ఒక్కసారిగా మూలమలుపు వద్ద రోడ్డు దిగి గుంతలోకి వెళ్ళింది. ఈ ఘటనతో కారులో ఉన్నవారంతా ప్రాణాన్ని అర చేతితో పెట్టుకుని బయటికి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు ప్రమాదం జరిగిన తీరు చూసి, అందులో ఉన్న వారికి ఏమి జరగకపోవడంతో నివ్వెరపోయారు. మినీ మేడారం జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు కనీస సూచికలు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.


