![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: కమలాపురం మండలం వంగపల్లిలో ఉన్న క్వారీని నిర్వహిస్తున్న మనోజ్ను రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.
ఈ కేసు నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy)ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్ (Subedari Policestation)కు తరలించారు. మరికొద్ది సేపట్లో ఆయనను కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కౌశిక్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy) అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసిన ఆయన.. ఇలా రాసుకొచ్చారు. “రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది. రైతుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నది. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నడు. కేసులు, అరెస్టులు బిఆర్ఎస్ నాయకులు (Leaders of BRS), కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తాం, నమ్మించి నయవంచన చేసిన ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతం. అక్రమంగా అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.” అని హరీష్ రావు రాసుకొచ్చారు.


