![]()
ప్రజాపాలన గ్రామసభను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
- ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందడమే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన లక్ష్యం
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం, అంజనాపురం గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గ్రామ సభను పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీల హామీలు అర్హులైన పేదలకు ప్రతి ఒక్కరికి ఆరు పథకాలు వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందని, ఈ ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమాలు ఈనెల 6వ తారీఖు వరకు ఉంటాయని, అధికారుల నేరుగా ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తు స్వీకరిస్తారని చెప్పారు. ఈ ప్రజాపాలన గ్రామసభలో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ అర్హత గల ప్రతి ఒక్కరు వృద్ధాప్య పింఛన్లు, గ్యాస్, రేషన్ కార్డులు, పోడు భూమి పట్టాలు గురించి ప్రతి ఒక్క సమస్యను ఈ ప్రజా పాలనలో పెట్టండి అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేయడానికి కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో వారిని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గత ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు అని ఆయన అన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా మణుగూరులో ప్రజాభవన్ మీకు అందుబాటులో ఉంటుందని, మీకు ఏ పని కావాలన్నా ఎవ్వరికి కూడా రూపాయి ఇవ్వొద్దని, అలా ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకొని రావాలని ఆయన అన్నారు.

అలాంటి వారిని కనీసం ప్రజాభవన్ గేటు కూడా తాకనివ్వను అని అన్నారు. నా ఓటమి కోసం బీఆర్ఎస్ లో పని చేసిన ఏ ఒక్కరిని కూడా నా దగ్గరకు రానివ్వను అని, నా గెలుపు కోసం కృషి చేసిన వారెవ్వరూ వాళ్ళని నా దగ్గరకు రానిస్తాను అని అపోహలు పెట్టుకోవద్దని, నా కార్యకర్తలను నేను నా గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కాపాడుకుంటా అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


