![]()
- ఎక్సైజ్ ఎస్సైకి మెమోరాండం అందించిన ఆదివాసి నాయకురాలు కంగాల రమణ కుమారి
భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో, జులై 03
భద్రాచలం పట్టణంలో అనేక కాలనీలలో విచ్చలవిడిగా బెల్ షాపుల నిర్వహణ కొనసాగుతా ఉందని, తక్షణమే వాటిని తొలగించాలని ఎక్సైజ్ సీఐ ఆఫీసులో ఎక్సైజ్ ఎస్సై కి మహాజన సమితి రాష్ట్ర ఆదివాసి మహిళ అధ్యక్షురాలు కంగాల రమణ కుమారి ఆధ్వర్యంలో మెమోరాండం అందించడం జరిగింది. ఈ సందర్భంగా కంగాల రమణ కుమారి మాట్లాడుతూ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం బెల్టు షాపులు గల్లీ గల్లీలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, వాటిని వెంటనే తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆమె కోరారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం మద్యాన్ని అమ్ముతూ ఏరులై పారిస్తున్నారని, దీనికి విద్యార్థులు, యువకులు అధిక శాతం బానిసలై కుటుంబాలు విచ్ఛిన్నమై పోవటానికి కారణమవుతుందని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు. మద్యం మత్తులో మహిళల్ని విచక్షణారహితంగా ర్యాగింగ్ చేస్తున్నారని, గొడవలకు, మానభంగాలకు, మద్యం కారణంగా ఉంటుందని, చిన్న చిన్న కుటుంబాలు సైతం రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆమె మండిపడ్డారు. ఏ గల్లీలో చూసినా యువకులు తాగి రోడ్లమీద కొట్లాడుతున్నారు అని, బ్యాచులు పెట్టి హల్చల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బెల్టు షాపులు మద్యాన్ని అధిక రేట్లకు విక్రయిస్తున్నారని దాని వలన ఆర్థిక భారం పేద, మధ్యతరగతి కుటుంబాల పైన పడుతుందని ఆమె పేర్కొన్నారు. బడి, గుడి అనే తేడా లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పట్టణంలో మద్యం షాపులు నడిపిస్తున్నారని, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాజుపేటలో మెయిన్ రోడ్ సెంటర్లో మూడు మద్యం షాపులు ఉండటం వలన తాగిన యువకులు రోడ్డు ఇరువైపులా తూగుతూ వచ్చి పోయే వాహనాలపై పడుతున్నారని, దానివల్ల అనేక ఆక్సిడెంట్లు జరుగుతున్నాయని ఆమె అన్నారు. రాజుపేటని అనుకొని చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాల్లో అధిక సంఖ్యలో రాత్రి సమయాల్లో తాగుతూ ఉన్నారని, అటువైపుగా మహిళలు పోవటానికి భయభ్రాంతులకు గురవుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎక్సైజ్ శాఖ అధికారులు పరిశీలించి ప్రజలకు అసౌకర్యంగా ఉన్న మద్యం షాపులను తొలగించాలని, బెల్టు షాపులను సంపూర్ణంగా పట్టణంలో లేకుండా తగు చర్యలు చేపట్టాలని ఆమె వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై స్పందించి తగు చర్యలు తీసుకుంటామని, బెల్ట్ షాపులను తొలగించే దాంట్లో పై అధికారులతో చర్చించి అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహాజన సమితి ఆదివాసి మహిళ జిల్లా అధ్యక్షురాలు పలక ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


