![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దేశ రాజధాని బీజింగ్ సహా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
నదులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు, రైల్వే మార్గాలు నీటమునిగాయి. డజన్ల కొద్దీ ఇళ్ళు కూలిపోయాయి. దీంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 80,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో మియున్కు చెందినవారే 17వేల మంది ఉన్నారు. లువాన్పింగ్ కౌంటీలోని గ్రామీణ ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొంతమంది ప్రజలు అక్కడే చిక్కుకుపోయారు.
సోమవారం హబీ ప్రావిన్స్లో కొండచరియలు విరిపడటంతో నలుగురు మృతిచెందగా, 8 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇక వరదల ప్రభావంతో ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది వరద నీటిలో కొట్టుకుని పోయారు. ఇప్పటికీ వారి జాడ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, రానున్న కొన్ని రోజుల పాటు మరింత భారీ వర్షాలు కురుస్తాయని చైనా వాతావరణ శాఖ హెచ్చరించింది. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు.


