![]()
మానవత్వం చాటుకున్న పాల్వంచ సీఐ
- గోల్డెన్ హావర్లో స్పందించి క్షతగాత్రున్ని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించిన అధికారి
బూర్గంపహాడ్, మన భద్రాద్రి,
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే గుర్తించి క్షతగాత్రులను దగ్గర్లోని ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తే ప్రాణాపాయ స్థితిలో నుంచి వారు బయటపడే ఆస్కారం ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయానికి, క్షతగాత్రులకు వైద్యం అందించిన సమయానికి మధ్యలో ఉండేదే గోల్డెన్ హవర్. ఎంతో విలువైన ఈ గోల్డెన్ హవర్లో ఓ నిండు ప్రాణాన్ని కాపాడి తన మానవత్వాన్ని చాటుకున్నారు పాల్వంచ సీఐ వినయ్ కుమార్.
ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మోరంపల్లి బంజర నుంచి పినపాక పట్టి నగర్ వైపు ప్రయాణిస్తున్నాడు. అదే సమయంలో పాల్వంచ వైపు నుంచి భద్రాచలం వస్తున్న గుర్తుతెలియని ట్రాలీ ఆటో ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా ఢీ కొట్టింది.
దీంతో ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై పడడం, అతని తలకు బలమైన గాయం అవ్వటం, రక్తస్రావం ఏర్పడడంతో స్థానికులు ఏం చేయాలా అని సందిగ్ధంలో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో పాల్వంచ నుంచి బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన పాల్వంచ సిఐ వినయ్ కుమార్ వెంటనే తన వాహనాన్ని నిలిపి పరిస్థితిని గమనించి క్షతగాత్రున్ని స్వయంగా తన వాహనంలో ఎక్కించుకొని మోరంపల్లి బంజర పిహెచ్సికి తరలించారు. వెంటనే చికిత్స అందించాలని వైద్యులను కోరడంతో స్పందించిన వైద్యులు అతనికి చికిత్స అందించారు. సకాలంలో క్షతగాత్రున్ని వైద్యశాలకు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు, సంఘటన స్థలంలో ప్రత్యక్షంగా చూసిన వారు సీఐ వినయ్ కుమార్ స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.


