![]()
చర్ల, మన భద్రాద్రి న్యూస్, జూలై 04
మండల కేంద్రంలో గురువారం రాత్రి మావోయిస్టులకు వ్యతిరేకంగా పలు ప్రధాన కూడళ్లల్లో కరపత్రాలు వెలిశాయి. రోడ్లపై పడేసి ఉన్న కరపత్రాలను స్థానిక ప్రజలు, బాటసారులు ఆసక్తిగా చదువుతున్నారు. కరపత్రాల్లో అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలతో మావోయిస్టులు చెలగాటం ఆడుతున్నారని అందులో ఆరోపించారు. మావోయిస్టులు పెడుతున్న మందు పాతరల వల్ల అనేక సందర్భాల్లో అమాయక ఆదివాసీలు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఇటీవల చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర వల్ల యాభై ఏళ్ల జోగి అనే ఆదివాసీ మహిళ తన రెండు కాళ్లు పోగొట్టుకొని శాశ్వతంగా వికలాంగురాలుగా మారిందని, అనేక సందర్భాల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాతరల వల్ల ఆదివాసీ గ్రామాల ప్రజలు, వారి మూగజీవాలు మృత్యువాత పడ్డాయని, మావోయిస్టులకు ఏదైనా జరిగితే స్పందించే ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలు, అమాయక ప్రజలు చనిపోతుంటే ఎందుకు స్పందించటం లేదని, ఈ ఘటనపై నిజనిర్ధారణ ఎందుకు చేయటం లేదని కరపత్రాల్లో పేర్కొన్నారు. మావోయిస్టుల చర్యలను కరపత్రాల ద్వారా విమర్శించారు. దీంతో స్థానికంగా ఈ కరపత్రాలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.


