![]()
జైపూర్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న వ్యాన్ను కంటైనర్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారు. మృతులంతా ఓ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని దౌసా-మనోహర్పూర్ రోడ్డులో ఆగి ఉన్న వ్యాన్ను కంటైనర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది భక్తులు ఖాఠుశ్యామ్ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఏడుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ స్పందించారు. ట్విట్టర్ వేదికగా సీఎం శర్మ.. ప్రమాద వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక, తమ వారిని కోల్పోయిన కారణంగా మృతుల కుటుంబ సభ్యలు కన్నీటిపర్యంతమవుతున్నారు.


