![]()
-హై లెవెల్ వంతెన లేక గ్రామస్థుల ఇబ్బందులు
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 22
మండల పరిధిలోని కొడవటంచ కిన్నెరసాని (ఏడుమెలకలవాగు) శుక్రవారం కురిసిన వర్షానికి వంతెనపై నుండి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో కొడవటంచ గ్రామస్థులకు అవస్థలు తప్పడం లేదు. వర్షాకాలం మొదలయిందంటే చాలు వారి బాధలు వర్ణనాతీతం. ఈ వాగు వచ్చిందంటే మండల కేంద్రానికి రావడానికి కొన్ని గంటలు తగ్గేదాకా వేచి చూడక తప్పదు. రహదారిపై లో లెవెల్ వంతెన ఉండడం వలన వర్షాకాలంలో వర్షం పడితే చాలు వాగు ఉదృతంగా పొంగిపొర్లుతుంది. అత్యవసర పరిస్థితిలో ఆ గ్రామస్థులు ప్రాణాలను పణంగా పెట్టి దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య గురించి గ్రామస్థులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఈ లో లెవెల్ వంతెనపై అధికారులు స్పందించి హై లెవల్ వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.


