![]()
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు..!
- 12 రోజుల పర్యటన షెడ్యూల్ వివరాలు
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో
రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు కూడా వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 4.35 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు న్యూయార్క్ విమానాశ్రయానికి చేరుకుంటారు. న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, దక్షిణ కొరియాలోని సియోల్లలో రేవంత్ బృందం పర్యటించనుంది. ఇవాల్టి నుంచి సుమారు 12 రోజులు విదేశీ పర్యటలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉండనున్నారు.
సీఎం పర్యటన వివరాలు..
- ఈ నెల 4వ తేదీన న్యూజెర్సీలో ప్రవాస తెలంగాణా ప్రజలతో జరిగే సమావేశంలో ఈ బృందం పాల్గొంటుంది.
- 5, 6 తేదీల్లో న్యూయార్క్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు.
- 6వ తేదీన పెప్సీకో, హెచ్సీఏ కంప్యూటర్స్ ప్రతినిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం వాషింగ్టన్ డీసీకి చేరుకుని అక్కడి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
- 7వ తేదీన డల్లాస్లో వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అదే రోజు అక్కడి గాంధీ స్మారక కేంద్రాన్ని సందర్శిస్తారు.
- 8వ తేదీన యాపిల్ తయారీ బృందం, ట్రైనెట్ సీఈవో, ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులు సమావేశమై చర్చించనున్నారు.
- 9వ తేదీన గూగుల్, అమెజాన్ తదితర కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాయంత్రం శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే ప్రవాస తెలంగాణుల సమావేశంలో వీరు పాల్గొంటారు.
- 10వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకుంటుంది.
- 12, 13 తేదీల్లో ఎల్ జీ, శాంసంగ్ తదితర వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడి అవకాశాలపై చర్చిస్తారు.
- 13వ తేదీ రాత్రి 11.50 గంటలకు సియోల్ బయలుదేరి.. 14వ తేదీ ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.


