![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. తన కూతురు కొండా సుస్మిత చేసిన ఆరోపణలు, తన శాఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంపై ఆమె స్పందించారు.
గురువారం క్యాబినెట్ భేటీ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మిస్ అండర్ స్టా్ండిగ్ తోనే గొడవలు జరిగాయన్నారు. కుటుంబం అన్నాక గొడవలు జరుగుతూనే ఉంటాయని సర్దుకుని ముందుకు వెళ్లాలని సురేఖ వ్యాఖ్యానించారు. తన ఇంటికి పోలీసులు రావడంతో తన కూతురు ఆవేశంతో మాట్లాడిందని, తన కూతురు తరపున సీఎం రేవంత్ కు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు సురేఖ. సీఎం రేవంత్ కు, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు సురేఖ. కాంగ్రెస్ ఒక కుటుంబమని, టీ కప్పులో తుఫాను మాదిరిగా గొడవలు వస్తాయని చెప్పారు. దీంతో కొద్ది రోజులుగా జరిగిన వివాదానికి తెర పడినట్లు అయింది.
- రెడ్డి వర్గం నాయకులు కుట్ర
తమ తల్లి, బీసీ మహిళా మంత్రి కావడంతో ఆమెను రాజకీయంగా అణగదొక్కేందుకు పార్టీలోని రెడ్డి వర్గం నాయకులు కుట్ర పన్నుతున్నారని కొండా సుస్మిత ఆరోపించారు. రెడ్లంతా ఒక్కటయ్యారు బీసీలను తొక్కేస్తున్నారు అంటూ ఘాటైన రాజకీయ విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి ఈ కుట్ర వెనుక ఉన్నారని ఆమె స్పష్టంగా పేర్లు ప్రస్తావించారు. సీఎం బ్రదర్స్ భూములు అక్రమించుకోవాలని చూస్తున్నారని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి వారికి సహకరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ తల్లిదండ్రులకు ఏమైనా హాని జరిగినా, దానికి సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి, వేం నరేందర్ రెడ్డిలదే పూర్తి బాధ్యత అని ఆమె హెచ్చరించారు. ఈ ఆరోపణల కారణంగానే తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


