![]()
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి పరోక్షంగా విమర్శలు చేశారు. జర్నలిజం ముసుగులో ఎవడెవడో వస్తున్నాడని, పొట్టకోస్తే అక్షరం ముక్క కూడా రానివాళ్లు జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని సీఎం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ..’సామాజిక బాధ్యతతో పని చేసే వారిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. సోషల్ మీడియా జర్నలిస్టులను అవమానించడం తగదు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు. సమాజం కోసం నిబద్ధతతో పని చేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది..అని రాసుకొచ్చారు.
ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పని చేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప… అవమానించడం సరికాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి శక్తిమేరకు పని చేస్తోందని చెప్పారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సోషల్ మీడియా జర్నలిస్టులపై మండిపడ్డారు. సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రధాన మీడియా జర్నలిస్టుల నుంచి వీరిని వేరు చేయాలని సూచించారు. రోడ్ల మీద తిరిగేవాడు, ఎక్కువ తిట్లు వచ్చినోడు జర్నలిజం ముసుగు తొడుక్కుని అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు.


